పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి ఓ డ్రామా అని తేల్చిన పోలీసులు

  • అల్లూరి సీతారామరాజు జిల్లాలో అభినయ్ దర్శన్‌పై హత్యాయత్నం జరిగినట్లు కేసు
  • సింపతీ కోసం వ్యక్తిగత అభినయ్ దర్శన్ డ్రామా ఆడినట్లు గుర్తించిన పోలీసులు
  • తనపై దాడి జరిగిందని, చంపేందుకు ప్రయత్నించారని నమ్మించే ప్రయత్నం చేసిన అభినయ్
పాస్టర్ అభినయ్ దర్శన్‌పై హత్యాయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అతనిపై దాడి జరగలేదని, అదంతా ప్రణాళిక ప్రకారం ఆడిన పెద్ద నాటకంగా పోలీసులు తేల్చారు. సింపతీ కోసం, ఇతర వ్యక్తిగత కారణాలతో అతను ఈ హైడ్రామాకు తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో అభినయ్ దర్శన్‌పై హత్యాయత్నం జరిగినట్లు కేసు నమోదైంది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా, విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. ఇటీవల చింతపల్లి పరిసర ప్రాంతాల్లో తన కారుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారని, తృటిలో తాను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని అభినయ్ దర్శన్ చేసిన ప్రచారం అంతా నాటకమేనని పోలీసులు తేల్చారు. తనను చంపేందుకు ప్రయత్నించారని అతను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.

అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ క్షేత్రస్థాయిలో లోతుగా దర్యాప్తు చేపట్టారు. విచారణలో అసలు అభినయ్ దర్శన్‌పై దాడి జరగలేదని తేలింది. ఈ నాటకంలో అతడికి మరో ఆరుగురు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. అభినయ్ దర్శన్‌కు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు సంబంధించిన ఆడియోలు, వీడియో చాట్‌లు, కీలకమైన వైద్యుల నివేదికను పోలీసులు పరిశీలించారు. ఇదంతా ఫేక్ అటాక్ అని తేల్చారు. దాడి జరిగిందంటూ హైడ్రామా సృష్టించిన అభినయ్ దర్శన్, ఇతరులపై పోలీసులు చర్యలు తీసుకోనున్నారు.

Abhinay Darshan
Pastor Abhinay Darshan
Andhra Pradesh
Chintapalli
Fake attack
Sympathy drama

More Telugu News